మహానాడుకి వస్తారా: జూ.ఎన్టీఆర్ అప్పటిదాకా సైలెన్స్!
దీంతో దీనిని పార్టీ, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసి టిడిపిలో ఉంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చారు. 2014లో తమదే అధికారం అని టిడిపి ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఫ్లెక్సీపై వ్యతిరేకత వ్యక్తం చేయని హరి
ఇటీవల కుటుంబ విభేదాలు బాగా ముదిరినట్లుగానే కనిపించాయి. నారా లోకేష్ - జూనియర్ ఎన్టీఆర్ల మధ్య లీడర్షిప్ పోరు కారణంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ ఫ్లెక్సీలలో ఉపయోగించుకోవడం, దానిపై హరికృష్ణ వ్యతిరేకత వ్యక్తం చేయక పోవడం చూస్తుంటే విభేదాలు ముదిరినట్లుగానే భావిస్తున్నారు.
తండ్రీ కొడుకుల వ్యవహార శైలి అనుమానం
అయితే నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం వహించి ఇరువర్గాలను చల్లార్చే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. హరికృష్ణ, జూనియర్లు చల్లబడ్డారా లేదా అని తెలుసుకునేందుకు అందరు మహానాడు కోసం ఎదురు చూస్తున్నారు. తాను కట్టె కాలే వరకు టిడిపికే అండగా ఉంటానని జూనియర్ చెప్పినప్పటికీ తండ్రీ కొడుకుల వ్యవహార శైలి మాత్రం తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది.
మహానాడులో వారిద్దరు పాల్గొంటే చల్లబడ్డట్లేనని, అదే జరిగితే వచ్చే ఎన్నికల నాటికి టిడిపికి ఇది అదనపు శక్తి అవుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే వారి వైఖరి చూస్తుంటే మాత్రం మహానాడుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని, వారు దాదాపు దూరమైనట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వారు తాము పార్టీకి అండగా ఉండమని బహిరంగంగా చెప్పనప్పటికీ ఎన్టీఆర్కు ఓ ఫ్లాట్ ఫాం దొరికే వరకు సైలెన్స్ మెయింటెన్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.