పురుగులను వెళ్లనీయండి: బాలకృష్ణ, రెండో లైన్లో లోకేష్
భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడు అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహోన్నత నేత అన్నారు. అన్నింటిలో ఆయన మేరునగధీరుడు అన్నారు. కాంగ్రెసు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజల కోసమే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారన్నారు. వెనుకబడిన వర్గాల వారికి టిడిపి అండగా ఉంటందన్నారు. వచ్చే ఎన్నికల్లో 1982 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయన్నారు.
పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు టిడిపి వల్లే వారికి మేలు జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఈ గడ్డ పైన పుట్టడం మన అదృష్టమన్నారు. కాంగ్రెసు అవినీతిని జాతీయం చేసిందని ఎద్దేవా చేశారు. పార్టీని వదిలి వెళ్లే వారని వెళ్లనీయండని అన్నారు. చంద్రబాబు పైన కూడా బాలయ్య పొగడ్తల వర్షం కురిపించారు.
బాబు తన పాలనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. బాబు తీసుకు వచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయని, ప్రజల వద్దకు పాలన పేరుతో ఆయన పారదర్శక ప్రభుత్వాన్ని అందించారన్నారు. ఎన్టీఆర్ ఆలోచన సామాజిక న్యాయమేనని, ఓటు బ్యాంక్ కాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు.
రెండో రోజు మహానాడులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కింది వరుసలో రెండో లైన్లో కూర్చున్నారు. కాగా అంతకుముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... కార్యకర్తల త్యాగాలు మరువొద్దన్నారు. కాంట్రాక్టులు, పదవుల కోసం ప్రస్తుతం కొందరు అవకాశవాదులు పార్టీలోకి వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
పార్టీలో గ్రూపులను పక్కన పెట్టాలని బాలకృష్ణ సూచించారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఫలితం ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు. టిడిపిది అభివృద్ధి వాదం అయితే.. కాంగ్రెసుది అవినీతి వాదమన్నారు. టిడిపి అనే మహా వృక్షానికి కొన్ని వందల పురుగులు పట్టాయని, అవి ఇప్పుడు పోతున్నాయన్నారు.