జగన్ దేవుడ్ని నమ్ముతున్నాడు, వస్తాడు: విజయమ్మ

కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని, ఈ మ్యాచ్ ఫిక్సింగ్లనూ స్పాట్ ఫిక్సింగ్లనూ ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్ప గత్యంతరం లేదని ప్రజలు నమ్మతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి తాము చాలా బాధలు పడుతున్నామని, ఒకరి బాధను మరొకరం పంచుకునే పరిస్థితి కూడా లేదని ఆమె అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ జగన్ ఫలానా పని చేయాలని ఎవరినీ అడగలేదని, ఎవరికీ ఫోన్ చేయలేదని, సచివాలయానికి గానీ సిఎం క్యాంపు ఆఫీసుకు గానీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోం మంత్రి పదవి కోసం జగన్ను ఆర్థిక ఉగ్రవాది అంటున్నారని, జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. పదవుల కోసం కాంగ్రెసు నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుట్రలను, కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విజయమ్మ అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని, గతంలో చిరంజీవి కాంగ్రెసుతో కలిసిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఇటీవల తాము ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని విప్ జారీ చేశారని ఆమె అన్నారు. చంద్రబాబు ఏది చెప్తే కాంగ్రెసు అది చేస్తోందని ఆమె అన్నారు. మంత్రులను ఎప్పుడు తొలగించాలో కూడా చంద్రబాబు చెబుతున్నారని ఆమె అన్నారు. సిబిఐ ఏం చేస్తోందో, ఎలా వ్యవహరిస్తోందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు.
జరిగినవాటి గురించి ఏమీ చేయలేమని, జరగేదాని గురించి ఆలోచించాలని వైయస్ రాజశేఖర రెడ్డి చెబుతుండేవారని, జగన్ జైలులో కూడా ధైర్యంగా ఉన్నారని, దేవుడే జగన్ను బయటకు తెస్తాడని, వైయస్ ప్రజల కోసం బతికారని, జగన్ ప్రజల్లో ఉండాలని అనుకుంటున్నాడని ఆమె అన్నారు. బాధ మనకే పరిమితం, బాధ్యత మరిచిపోకూడదని వైయస్ చెబుతుండేవారని, అన్న కోసం షర్మిల ప్రజల మధ్యకు వెళ్లిందని విజయమ్మ అన్నారు.
జగన్ను విలువలతో పెంచాం: విజయమ్మ
తమ కుమారుడు వైయస్ జగన్ను విలువలతో పెంచామని విజయమ్మ అన్నారు. దీక్షా శిబిరంలో ఆమె మంగళవారం సాయంత్రం ప్రసంగించారు. జగన్ను ఇరికించడానికి కాంగ్రెసు మంత్రులను బలి చేసిందని ఆమె విమర్శించారు. వైయస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలున చేయకపోతే మంత్రులైనా దాఖలు చేయాల్సిందని ఆమె అన్నారు. జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోనని అన్నందుకే నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. జగన్ను విచారించకుండానే మూడు చార్జిషీట్లలో తొలి ముద్దాయిగా సిబిఐ చేర్చిందని ఆమె విమర్శించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు కాంగ్రెసును అధికారంలోకి తెచ్చారని, ప్రతిఫలంగా వైయస్ కుటుంబానికి వేధింపులు బహుమతిగా ఇస్తున్నారని ఆమె అన్నారు. చట్టాలను, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి జగన్ను జైలు పాలు చేశారని ఆమె విమర్శించారు. దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అమలవుతోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్ట అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అవినీతి చట్టసభల సాక్షిగానే బయటపడిందని, చంద్రబాబు అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె అన్నారు. జగన్ను బయటకు తేవడానికి ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని విజయమ్మ అన్నారు.












Click it and Unblock the Notifications