జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యలపై టిడిపి: లేదంటూనే మళ్లీ హరికృష్ణ
నందమూరి కుటుంబానికి ప్రత్యేకంగా ఆహ్వానం అవసరం లేదని పార్టీ నేత బండారు సత్యనారాయణ చెప్పారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలకు కూడా ఆహ్వానం పంపించలేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీలోని ఏ కార్యక్రమానికైనా ఎప్పుడైనా వచ్చే హక్కు ఉందని చెప్పారు. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం అవసరం లేదన్నారు. మరోవైపు నివాళులు అర్పించేందుకు వచ్చిన నందమూరి హరికృష్ణ ఈ రోజు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు.
కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూనే.. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించేందుకు ఇది వేదిక కాదని హరికృష్ణ అన్నారు. ఇలాంటి వేదికలపై తాను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. తద్వారా హరికృష్ణ తన అసంతృప్తిని మరోసారి బయట పెట్టారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, హీరో బాలకృష్ణ, భువనేశ్వరి, కేంద్రమంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి, కల్యాణ్ రామ్ తదితరులు ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.