రైలు టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు- ఇక నుంచి, మరింత సలభంగా..!!
రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రైలు టికెట్ బుకింగ్ ప్రయాణీకులకు ఇక సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెడుతూ రైల్వే శాఖ కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. ఈ మేరకు తుది కసరత్తు జరుగుతోంది. IRCTC ద్వారా నిత్యం లక్షల సంఖ్యలో టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సాంకేతిక సమస్యలతో పాటుగా టికెట్ రిజర్వేషన్ల లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారం కోసం ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు.
టికెట్ బుకింగ్ కోసం IRCRC పోర్టల్ లో కొత్త మార్పులు తెస్తోంది. సాధారణంగా ఉదయం 10, 11 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో ఐఆర్సీటీసీ సర్వర్లు తరచూ డౌన్ అవుతున్నాయి. దీని పైన పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరికొత్త సర్వర్ టెక్నాలజీతో, అత్యంత వేగంగా టికెట్లు బుక్ చేసుకునేలా ఈ కొత్త పోర్టల్ను భారీగా అప్గ్రేడ్ చేశారు. అందులో భాగంగా టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు తీవ్ర అసహనం కలిగించే క్యాప్చా కోడ్లను ఎంటర్ చేసే విధానాన్ని, అనవసరమైన పాప్-అప్లను ఈ కొత్త వెబ్సైట్ నుండి పూర్తిగా తొలగించారు. దీంతో టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. టికెట్ బుక్ చేయడానికి పేజీల కొద్దీ నింపే అవసరం లేకుండా బుకింగ్ స్టెప్స్ను చాలా వరకు తగ్గించారు.

ప్రయాణీకులకు వెసులుబాటు
అదే విధంగా ప్రతి క్లాస్ సీట్లను విడివిడిగా చెక్ చేసుకునే పనిలేకుండా.. అన్ని క్లాసుల (Sleeper, 3AC, 2AC, 1AC) సీట్ల లభ్యతను ఒకేసారి, ఒకే స్క్రీన్పై చూసుకునే సదుపాయం అందుబాటు లోకి తీసుకొచ్చారు. అదే విధంగా ప్రయాణికుల వివరాలను ముందే సేవ్ చేసుకునేలా మార్పులు చేశారు. దీనివల్ల తత్కాల్ సమయంలో కేవలం ఒక్క క్లిక్తో వివరాలన్నీ ఆటోమేటిక్గా అందే విధం గా రూపకల్పన జరిగింది. దాంతో వెబ్సైట్ వేగంగా పనిచేయడంతోపాటు టికెట్ బుకింగ్ మరింత సులభమవుతుంది. టికెట్ బుకింగ్కు అవసరమైన దశల సంఖ్యను కూడా తగ్గించారు. కాగా, తరచూ ప్రయాణించేవారు ప్రతిసారీ అవే వివరాలను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్తోపాటు వివిధ రైల్వే టికెట్ బుకింగ్ యాప్లకు ఆధారమైన ప్రయాణికుల రిజర్వేషన్ ఇంజిన్ను కూడా మరింతగా మార్పు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications