బాబు పిహెచ్డి, చిదంబరాన్ని కలిసి మాఫీ: షర్మిల
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దీక్ష చేపట్టిన షర్మిల మంగళవారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఉన్న ముద్రను చెరిపే ప్రయత్నంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ను భగీరథుడు అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని షర్మిల అన్నారు.
జగన్ను అడ్డుతొలగించేందుకే కాంగ్రెసు కుట్రలు చేస్తోందని అన్నారు. ఈనాడు షేర్లను లక్షల రూపాయలకు అమ్ముకున్నా అడ్డుపడని సిబిఐ, సాక్షి షేర్లను రూ.350కు అమ్మితే క్విడ్ప్రోకో కింద పరిగణించిందని ఇవన్నీ కుట్రలో భాగమన్నారు. ఎన్ని అవినీతి ఆరోపణలున్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఎందుకు విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు కాబట్టే సిబిఐని చంద్రబాబుపైకి ఉసిగొలపడం లేదన్నారు. చంద్రబాబుపై ఏ విచారణలు ఉండవన్నారు. మేనేజ్ చేయడంలో చంద్రబాబు పీహెచ్ డీ సంపాదించాడని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు లేకుండా చేసుకున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఆపలేరని అన్నారు.