ఖాళీ హీరోయిన్లతో పొగడ్తలు:టిఎస్సార్పై పురంధేశ్వరి భర్త
తాము కాంగ్రెసు పార్టీలో చేరినప్పటి నుండి ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం టిక్కెటే తమకు కావాలని అడిగిన సందర్భాలు లేవన్నారు. తమకు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నర్సారావుపేట టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు అభ్యంతరం లేదన్నారు. సుబ్బిరామి రెడ్డి నిత్యం తాను విశాఖ నుండి పోటీ చేస్తానని, 2009లో పురంధేశ్వరి నర్సారావుపేట టిక్కెట్ అడిగారు కాబట్టి అదే టిక్కెట్ ఇస్తారని చెప్పడాన్ని ఆయన ఖండించారు.
తాము ఈ సీటు కావాలని ఎప్పుడు అడగలేదన్నారు. 2009లో టిఎస్సారే పురంధేశ్వరికి వైజాగ్ టిక్కెట్ ఇవ్వవద్దని లేఖ రాశారని ఆరోపించారు. 1981 - 82లో టిఎస్సార్ అరెస్టైయినప్పటి నుండి తమకు తెలుసునని చెప్పలేదు. టిఎస్సార్ తనకు నచ్చిన సీటును కోరుకోవచ్చునని అసత్యాలు చెప్పవద్దని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ప్రజలను అపోహలకు గురి చేసే విధంగా ఉన్నందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
ఖాళీగా ఉన్న సినిమా తారలతో టిఎస్సార్ ఫంక్షన్లను ఏర్పాటు చేసుకొని తనను పొగిడించుకుంటారని ఎద్దేవా చేశారు. పనికిమాలిన బిరుదులు తీసుకుంటారన్నారు. టెండర్లు తక్కువ ధరకు కోట్ చేసి ఆ తర్వాత నష్టం వచ్చిందని అమౌంట్ పెంచుకోవడం ఆయన నైజమని, అలా వచ్చిన డబ్బులతో ఆయన హోటళ్లు నిర్మించారని ఆరోపించారు.
కాగా విశాఖ లోకసభ టిక్కెట్ కోసం టిఎస్సార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం తనకు విశాఖ టిక్కెట్ ఇస్తుందని, పురంధేశ్వరి నర్సారావు పేట నుండి పోటీ చేస్తారని పలుమార్లు చెప్పారు. దీనిపై ఈ రోజు దగ్గుపాటి స్పందించారు.