విజయమ్మ దీక్ష వెలవెల, షర్మిల యాత్ర పలుచన?
ఈ దీక్ష జనం లేక వెలవెల పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందంటున్నారు. రాజధానిలోనే ఇలా విఫలమైతే మిగిలిన ప్రాంతాలలో పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోందని అంటున్నారు. జగన్ అరెస్టు తప్పని చెప్పే ఈ దీక్షకు జనం రాలేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోందట. ఇందుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట.
హైదరాబాద్ దీక్షను పది రోజుల క్రితమే ఖరారు చేసినప్పటికీ జన సమీకరణలో విఫలమయ్యామని భావిస్తున్నారట. పెద్ద ఎత్తున తరలి వస్తారనుకుంటే వెలవెల పోయిందని పార్టీలోనే ఆందోళన ప్రారంభమైందట. ఉదయం పదిన్నర గంటలకే విజయమ్మ, భారతిలు దీక్షస్థలికి చేరుకన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పలుచగానే కనిపించిందంటున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం.
మరోవైపు షర్మిల పాదయాత్రకు కూడా జనాలు పలుచన పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఆమె ఎక్కడా మాట్లాడకుంటా కేవలం పలకరిస్తూ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారని అంటున్నారు. పార్టీలోని నేతల మధ్య విభేదాలు కూడా జనాలు పలుచనగా ఉండేందుకు కారణమవుతున్నాయని అంటున్నారు.