మాట నిలబెట్టుకోవాలి: రాజ్నాథ్, తెరాసపై నో కామెంట్

బిజెపి రాజకీయ చరిత్రలో ఆడిన మాట తప్పిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ విషయంలో తామిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెసు మాట నిలబెట్టుకోలేదని, తాము మాత్రం 2014లో అధికారంలోకి రాగానే తెలంగాణను ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ఘనత బిజెపిదే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
యూపిఏ పాలనలో దేశం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందన్నారు. రక్షణ, విదేశాంగ రంగాల్లో బలహీనపడ్డామన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినా చీమ కుట్టినట్లు కూడా ప్రభుత్వానికి లేదన్నారు. ఏం చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. చైనా పర్యటన కోసం విదేశాంగ శాఖ మంత్రి తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ దళాలు వచ్చి మన జవాన్ల తలలు నరికి పట్టుకు వెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టుల దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ ఘటనను రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తోందని, మావోలు అణిచివేతకు కేంద్రం వద్ద కార్యాచరణ లేదన్నారు. అన్ని అంశాలలో కల్లిబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ద్రవ్యలోటు నియంత్రణ, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే మంత్రులతో రాజీనామా చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత ప్రజాధరణ గల నేత అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications