ధరల పెరుగుదల: ఎర్రగడ్డ రైతు బజార్లో శోభా నాగి రెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి మంగళవారం ఎర్రగడ్డ రైతు బజార్ను సందర్శించారు. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరల విషయాన్ని తెలుసుకొని, అసెంబ్లీలో ప్రస్తావించేందుకు శోభా నాగి రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రైతు బజార్కు వెళ్లారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న కూరగాయల ధరలను తెలుసుకునేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, ప్రత్తిపాటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్, నాగి రెడ్డి రైతు బజార్కు వచ్చి కొనుగోలుదారులు, అమ్మకపుదారుల స్పందనను తెలుసుకున్నారు.
అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర ఏవిధంగా ఉంది, రైతు బజార్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటి, స్థానిక అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. అన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కూరగాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలయయిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అసలే విద్యుత్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలతో సతమౌతున్న సామాన్య ప్రజలు పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని వారు అన్నారు. ఇప్పటికైనా ఇటు ప్రజలకు అటు రైతులకు ఇబ్బంది కల్గకుండా నిర్దిష్ట ప్రణాళికలు అమలు చేసి, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోనికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.