టిడిపి చరిత్ర చెప్పనా?: బాబుని దులిపేసిన కిరణ్, కన్నా
సభలో మంత్రులకు కిరణ్ చేయూత
కళంకిత మంత్రులు అని టిడిపి అనడంపై ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్కడ రుజువు కాలేదన్నారు. ఛార్జీషీట్ వేసినందున ఇద్దరు మంత్రులు కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా రాజీనామా చేశారని, అంతమాత్రాన వారు తప్పు చేసినట్లు కాదన్నారు. మిగిలిన మంత్రులపై సిబిఐ ఎలాంటి అభియోగాలు మోపలేదన్నారు.
ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడటం సరికాదన్నారు. స్టే తెచ్చుకున్న వారు తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. టిడిపి హయాంలో తీసుకున్న నిర్ణయాలు కూడా పలు కోర్టులో ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెసు వారు మాత్రమే జైలుకెళ్లారా? టిడిపి నేతలు వెళ్లలేదా అని ప్రశ్నించారు. స్టాంప్ కుంభకోణంలో ఎన్నేళ్లు జైళ్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ గురించి మాట్లాడటం సరికాదన్నారు.
దోచుకున్న వీళ్లా మాట్లాడేది: కన్నా
తెలుగుదేశం పార్టీ తన హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నదని, ఇలాంటి టిడిపియా తమను విమర్శించేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. రాంకీ అంశంపై తనపై అభియోగాలు ఉన్నాయని కానీ, ఆ జీవో ఇచ్చింది తాను కాదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే ఇలా విమర్శలు చేస్తున్నారన్నారు. ఇంగ్లీషు చదివిన అశోక గజపతి రాజు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు.
టిడిపిది దొంగల పార్టీ అని, అవసరమనైతే వారి చరిత్ర మొత్తం చదివేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బాబు హయాంలోనే జన్మభూమి, పనికి ఆహార పథకం, స్టాంపుల, స్కాలర్ షిప్స్లలో దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న టిడిపి నేతలు తమ గురించి మాట్లాడుతారా అన్నారు. తాను కళంకితుడిని కాదన్నారు.