రెండు వారాల్లో కేదార్నాథ్ ఆలయంలో పూజలు
న్యూఢిల్లీ: కేదార్నాథ్ ఆలయం ప్రాంగణంలోని మృతదేహాలను అన్నింటినీ తొలగించారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిని చేపట్టనున్నారు. శుద్ధి కార్యక్రమం కూడా చేపట్టడానికి ఆలయ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. వరదలు, భారీ వర్షాలతో కేదార్నాథ్ మొత్తం అతలాకుతలం అయింది.
8వ శతాబ్దిలో నిర్మించిన కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి పది మంది ఆలయ కమిటీకి చెందిన సభ్యులు శుక్రవారం కేదార్నాథ్ చేరుకుంటారు. శుద్ధి కార్యక్రమం, లాంఛనంగా పూజలు నిర్వహిస్తారు.

ఆలయంలో ఇప్పటి వరకు పూజలు జరగలేదని, ముందు చెత్తనంతా తొలగించాల్సి ఉంటుందని, కమిటీ పది మందిని అక్కడికి పంపిస్తోందని, కేదార్నాథ్ ఆలయం ఎగ్గిక్యూటివ్ అధికారి అనిల్ శర్మ నేతృత్వంలో ఆ బృందం హెలికాప్టర్లో అక్కడికి వెళ్తుందని బద్రినాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు, శ్రీనగర్ శాసనసభ్యుడు గణేష్ గోడియాల్ చెప్పారు.
శివలింగం 1.5 అడుగులు కిందికి వెళ్లిపోయిందని, కానీ చెక్కు చెదరకుండా ఉందని, లింగానికి గానీ ఇతర విగ్రహాలకు గానీ ఏ విధమైన నష్టం జరగలేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆలయ సిబ్బంది చాలా మంది కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కనీసం 15 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. ఆ పని పూర్తి కాగానే శంకరాచార్యాజీ, రావల్జీ నేతృత్వంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications