దిగ్విజయ్ మాటలు: విభజనపై ఇరు వైపులా ఉత్కంఠ

అయితే, ఆయన మాటలు విభజనకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో సీమాంధ్ర నాయకులు కొంత దిగ్భ్రాంతికి గురైన సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నాయకుల్లో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. ప్రతిసారీ తెలంగాణకు అనుకూలంగా ప్రచారం జరగడం మళ్లీ అంతే తీవ్రతతో వెనక్కి వెళ్లడం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశంపై విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ చేయడానికే రాష్ట్ర పర్యటనకు వచ్చినట్లు కూడా అర్థమవుతోంది. ఆయన ఇరు ప్రాంతాల నాయకులను కూడా కలుస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంతాల నాయకులకు కూడా తమ వాణిని వినిపించుకోవడానికి సరళమైన మార్గం చూపించారు. అభిప్రాయాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వినిపించాలని ఆయన ఇరు ప్రాంతాల నాయకులకు చెబుతున్నారు. ఈ అభిప్రాయాలతో కాంగ్రెసు కోర్ కమిటీకి ఆ ఇరువురు నాయకులు నివేదికలు సమర్పిస్తారని చెబుతున్నారు.
వారం, పది రోజుల్లో తెలంగాణపై నిర్ణయం వెలువరిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పడం కూడా ఉత్కంఠకు కారణంగా మారింది. అయితే, ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదని సీమాంధ్ర నాయకులు కొంత ధైర్యం ప్రదర్సిస్తున్నారు. కానీ, ఇప్పటికే జాప్యం జరిగిందనే మాట దిగ్విజయ్ అనడాన్ని బట్టి వీలైనంత త్వరగా నిర్ణయం వెలువరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ ఇరు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలు తీసుకుంటారని గవర్నర్ నరసింహన్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
మొత్తం మీద, పార్టీని గాడిలో పెట్టడానికి తెలంగాణ సమస్యను పరిష్కరించడం తప్పదనే గట్టి నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు అర్థమవుతోంది. అయితే, కాంగ్రెసు కసరత్తు మీద మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications