అప్పు: స్నేహితురాలిపై దాడి, ఎమ్మెల్యే భార్యపై ఫిర్యాదు
ఇంకా రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ సుధీర్ రెడ్డి మేనల్లుడుని వెంటబెట్టుకొని కమల ఆదివారం రాత్రి అరుణ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో అరుణ తలకు గాయమైంది. దీంతో మిగిలిన డబ్బులు ఇవ్వకుంటే తనను చంపుతానని బెదిరించారని, తన కుటుంబానికి కమల నుండి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అరుణ ఆదివారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
ఆస్మాన్ఘడ్ త్రివేణి నగర్లో ఉండే ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు, భార్య అరుణ ఉంటున్నారు. కమల నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్న అరుణ.. ఆ డబ్బును అధిక వడ్డీకి అబిడ్స్లోని ఓ జువెలర్స్ యజమానికి ఇచ్చారు. సదరు జువెలర్స్ యజమాని వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీశాడు. ఇటీవల ఐపి పెట్టాడు.
ఈ నేపథ్యంలో అప్పు మొత్తం తీర్చానని అరుణ చెప్పగా.. ఇంకా చెల్లించాల్సి ఉందని కమల అరుణ ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. తాను చెల్లించాల్సిది ఏమీ లేదని అరుణ చెప్పడంతో వారు ఆమెపై దాడి చేశారు. అరుణకు గాయమైంది. అరుణ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సైదాబాద్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. కాగా, తన భార్యను పావుగా చేసి కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.