12న చర్చిస్తాం, ఆ తర్వాత తేల్చేస్తాం: తెలంగాణపై డిగ్గీ
తెలంగాణవాదం కెసిఆర్ది కాదు: కెఎస్ రత్నం
తెలంగాణవాదం తెలంగాణ రాష్ట్ర సమితిదో, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుదో మాత్రమే కాదని తెలుగుదేశం పార్టీ నేత కెఎస్ రత్నం అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణను కోరడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కెసిఆర్ ఆలోచనలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయించడం తెరాసకు అలవాటే అన్నారు.
ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును హత్య చేయించేందుకు కెసిఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రవీంద్ర నాయక్, చింతాస్వామి, గద్దర్ల పైన దాడులు చేయించారని ఆరోపించారు.
ఎన్నికలకు అడ్డుకాదు: సారయ్య
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ ఎన్నికలు అడ్డుకావని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య వేరుగా అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు సమావేశాలు, సంప్రదింపులు కొనసాగుతాయన్నారు. ఈ నెల 12న జరిగే మంత్రివర్గ సమాశంలో తెలంగాణ అంశంపై తమ పార్టీ స్పష్టమైన వైఖరి వెల్లడిస్తుందన్నారు.