దీదీ ఆహ్వానం: మనసు విప్పని వైయస్ జగన్, అందుకే..

వైయస్ జగన్ మనసు మరో వైపు లాగుతుండడం వల్లనే ఫెడరల్ ఫ్రంట్ పట్ల సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్లో చేరే విషయంపై వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. కానీ తాము పంచాయతీ ఎన్నికల్లో మునిగిపోయామని, జాతీయ స్థాయి రాజకీయాల్లో పోషించే పాత్రపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాము సమావేశమై మమతా బెనర్జీ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి చెప్పారు. మమతా నిలకడలేని నాయకురాలని, ఆమెకు ధన్యవాదాలు చెప్పి తమ దారి తాము చూసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొందరు తెర వెనక అంటున్నారు.
వైయస్ జగన్తో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం మాట్లాడారు. ఈ సంభాషణల్లో మమతా బెనర్జీ ఆహ్వానంపై ఏ విధమైన ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్నాయని భావించి మమతా బెనర్జీ వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపారు.
అయితే, వైయస్ జగన్ జాతీయ స్థాయిలో అవగాహనపై వేచి చూసే ధోరణి ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్సించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ స్థితిలో మమతా బెనర్జీకి అప్పుడే సమాధానం ఇవ్వకూడదని వైయస్ జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications