పిక్చర్స్: రాజకీయాలపై రాధికా కుమారస్వామి అయిష్టత
బెంగళూర్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి సతీమణి, నటి రాధిక రాజకీయాల పట్ల అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి గ్లామర్ తార అయిన రాధిక స్వీటీ సినిమాతో మళ్లీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడ్డారు. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఇటీవల ప్రచారం కొనసాగింది.
జయలలిత వంటి తారలు వివిధ రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో రాధిక కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఆ ఊహాగానాలకు రాధిక తెర దించారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. ఇటీవల ఆమె కూర్గ్కు విహార యాత్రకు వెళ్లారు. ఆమె కుషాయినగర్లోని హోటల్లో బస చేశారు. ఇక్కడ ఆమె ఆ ప్రకటన చేశారు.
తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తన మనసంతా సినిమాలపైనే ఉందని రాధికా కుమారస్వామి చెప్పారు. ఆమె కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు.

ప్రముఖ నటి రాధిక 2006లో రాజకీయ నాయకుడు హెచ్డి కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. ఆమె చివరి చిత్రం ఈశ్వర్. ఆమె వివాహం చేసుకోవడంతో ఆ సినిమా ఇప్పటి వరకు బయటకు రాలేదు.

సినీ పరిశ్రమకు తాను ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నట్లు రాధిక తెలిపారు. ఇప్పుడు తన కూతురు షమికకు నాలుగేళ్ల వయస్సు అని, దాంతో తాను సినిమాలపై దృష్టి పెట్టగలనని, తిరిగి సినిమాల్లోకి వస్తానని రాధిక చెప్పారు.

ఈ ఏడాది నుంచి షమిక పాఠశాలకు వెళ్తోందని, ఇప్పటి వరకు సెట్స్కు తనతో పాటు వస్తూ ఉందని, పరిశ్రమలో తనకు స్నేహితులు పెద్దగా లేరని, తన కూతురే తనకు మంచి స్నేహితురాలని రాధిక అన్నారు.

స్వీటీ సినిమా దాదాపు పూర్తి కావచ్చందని, విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. ఆదిత్యతో పాటు రమ్యకృష్ణ, జై జగదీష్ ఈ చిత్రంలో నటించారని, వారు తన తల్లిదండ్రుల పాత్రలు పోషించారని, సాధు కోకిల కూడా ఈ సినిమాలో ఉన్నారని రాధికా కుమారస్వామి చెప్పారు.

రాధికా కుమారస్వామి నటించిన స్వీటి సినిమాకు విజయలక్ష్మీ సింగ్ దర్శకత్వం వహించారు. సాయి ప్రకాష్ దర్శకత్వం వహించే సినిమా చేయడానికి కూడా రాధిక అంగీకరించారు. ఇందులో శివరాజ్ కుమార్ నటిస్తాడు. ఈ ముగ్గురి సారథ్యంలో ఇంతకు ముందు వచ్చిన తవరిగే బా తంగి విజయం సాధించింది.












Click it and Unblock the Notifications