పంచాయతీ: జగన్ పార్టీతో వారి దోస్తీ, జఫ్పా నయనతార
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా నారాయణపురంలో వారూ వీరూ ఒక అవగాహనకు వచ్చేశారు. పొంగులేటికి సోదరుడి వరుసయ్యే శ్రీనివాస రెడ్డి జగన్ పార్టీలో ఉన్నారు. వారు నారాయణపురం సర్పంచ్ పదవికి తరుమణి పద్మావతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్లో ఉండగా ఆయన సోదరుడు నారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సోదరులు సర్పంచ్ అభ్యర్థులను కలిసికట్టుగా నిలబెడుతున్నారు.
ఇలా పలు గ్రామాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. తమ పార్టీకి అభ్యర్థులు కరువైన చోట కూడా ఆ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతున్నాయి. మరికొన్నిచోట్ల వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాల పంచాయతీ సర్పంచ్ను ఎస్సీకి కేటాయించారు. ఆ గ్రామంలో ఎస్సీ ఓటర్లే లేరు. సర్పంచుకు పోటీపడే వారు ఎలాగూలేరు. వార్డు సభ్యులకు కూడా గ్రామస్థులు ఎవరూ నామినేషన్లు వేయలేదు.
వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలోనూ ఇదే జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి కేటాయించారు. ఆ గ్రామంలో గిరిజన ఓటర్లు ఎవరూ లేరు. గ్రామస్తులు వార్డు సభ్యులకు కూడా పోటీ పడకుండా వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఏకగ్రీవం అయ్యాయి. కొన్నిచోట్ల వేలం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
తప్పుల తడక
పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టు కొన్నిచోట్ల తప్పులతడకగా ఉంది. నల్గొండ జిల్లా నేరేడుచర్లలో నయనతార ఫోటోతో జఫ్పా నయనతార పేరుతో ఓటు హక్కు వచ్చింది.