ప్లాప్ సినిమా కంటే: మోడీ సభకి రూ.5పై మనీష్ తివారీ
బాబాల ప్రవచం వినాలంటే వంద రూపాయల నుండి పదివేల రూపాయల వరకు చెల్లించి టిక్కెట్ కొనాలని, బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపు సినిమా టిక్కెట్ కూడా రూ.200ల నుంచి రూ.500 వరకు ఉంటుందని, మోడీ ప్రసంగానికి నిర్దేశించిన ఈ ఐదు రూపాయల టిక్కెట్టు ఆయన మార్కెట్ విలువకు నిదర్శనమని మనీష్ తివారీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మోడీ మాట్లాడుతుంటే వినేందుకే రూ.5 పన్ను విధిస్తే 120 కోట్ల మందిపై మాట్లాడే పన్ను ఇంకెంత విధిస్తారోనని ఎద్దేవా చేసారు.
కాగా ఆగస్టు 11న హైదరాబాదులో నిర్వహిస్తున్న సభకు ఒక్కొక్కరికి ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు వినియోగించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పార్టీ ప్రధానకార్యదర్శి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, పార్టీ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావులు ఖరారు చేశారు.
క్షేత్రస్థాయిలో సభకు హాజరయ్యే వారిని గుర్తించి వారి వివరాలను నమోదు చేసుకుని ఆహ్వాన పత్రాన్ని అందిస్తామని, ఆహ్వానపత్రం ఉన్న వారినే సభకు అనుమతించే అంశం కూడా పరిశీలిస్తున్నామని వారు చెప్పారు. మోడీ హైదరాబాద్ సభ దాదాపు ఎన్నికల సభగా నిర్వహించాలనే చూస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ పార్టీ దిశనూ, దశనూ వివరించడంతో పాటు భవిష్యత్ పార్టీ సన్నాహాలను కూడా వివరించే అవకాశం ఉంది.
టికెట్ పెట్టడం వల్ల మోడీ సత్తా మాత్రమే కాదు, పార్టీకి రాష్ట్రంలో ఉన్న పునాది ఏమిటో తెలిసి వస్తుందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సభకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో కూడా తమ పేర్లను నమోదు చేసుకునే వీలుకల్పిస్తున్నట్టు వెల్లడించారు. మోడీ సభను నిర్వహించేందుకు ఇప్పటికే ఎల్బి స్టేడియంను ఖరారు చేశారు.