గోదారి వరద ఉధృతి: భద్రాచలం వద్ద తగ్గుముఖం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం వ్దద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడ నీటి మట్టం 15.3 అడుగులు ఉంది. 15.45 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు.
ఇదిలావుంటే, వచ్ేచ 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణీ స్థిరంగా కదులుతోంది. దీనికితోడు, తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పొట్లాలను అందజేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పంట నష్టమైంది.
గోదావరి వరద ఉధృతికి కోనసీమ లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితిని సమీక్షించడానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పడవలో లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు ముప్పును కలిగిస్తున్నాయి. పిట్టం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద వరద ఉధృతికి నల్లవాగు వంతెన దెబ్బ తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications