విడిపోతామంటే...: 'అన్నదమ్ముల'పై బొత్స కొత్త వ్యాఖ్య

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవాల్లో కాంగ్రెసు పార్టీయే ఎక్కువ స్థానాలను సాధించిందన్నారు. మూడు అంచెల ఎన్నికలు పూర్తయ్యేసరికి కాంగ్రెసు పార్టీయే ముందంజలో ఉంటుందన్నారు. తమ పార్టీ కేవలం నాలుగైదు జిల్లాల్లో వెనుకబడి ఉన్నా, రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువవుతామన్నారు. తెలుగుదేశం పార్టీ అంచనాలు తారుమారయ్యాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కేవలం రెండు మూడు జిల్లాలకే పరిమితమైందన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధించినవి కావని, అయినా తమ మద్దతుదారులు చాలాస్థానాల్లో గెలుపొందారని చెప్పారు. ఎవరేమిటో ప్రజలు గుర్తించారని చెప్పారు. మొత్తంగా తాము ఇప్పటి వరకు తమ మద్దతుదారులు 2700 పంచాయతీలను కైవసం చేసుకున్నారని బొత్స చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. నోడల్ వ్యవస్థ తెచ్చే ఉద్దేశ్యం లేదన్నారు.
తెలంగాణపై...
విభజన సమస్యను రాజకీయాలతో ముడిపెట్టవద్దని బొత్స అన్నారు. రాజకీయ అవసరాల కోసం విభజన అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని ఏ ఒక్క ప్రాంతానికి ఆపాదించవద్దని కోరారు. సీమాంధ్ర వ్యక్తిగా తాను రాష్ట్రం యథాతథంగా ఉండాలని కోరుకుంటానని అయితే, అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని చెప్పారు. విభజన జరిగితే అభివృద్ధి ఆగిపోతుందనేదే తన ఆందోళన అన్నారు. ఓ కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోతామంటే కుటుంబ పెద్ద ఎలా ఆలోచిస్తాడో కాంగ్రెసు పార్టీ అలాగే ఆలోచిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications