విభజన: పయ్యావుల కంటతడి, జగన్ పార్టీ మండిపాటు

గతంలో ఎన్నడూ రాష్ట్ర సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పని కాంగ్రెసు పార్టీ ఇప్పుడు హడావుడిగా నిర్ణయం వెల్లడించడమేమిటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశ్నించింది. జలవనరులు, ఆదాయాల పంపిణీ, హైదరాబాద్ భవితవ్యం వంటి అంశాలపై ఎలాంటి సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం ప్రకటించడం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది.
కాంగ్రెసు పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని కోట్లాది మంది ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, సుచరితలు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నలీ జలాల పంపిణీ, రెవెన్యూ పంపిణీ, కొత్త రాజధాని ఏర్పాటు, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించాలన్నారు.
రాష్ట్రాన్ని చీల్చడం వల్ల నష్టపోయే ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి అన్నారు. రెండు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విభజనతో నష్టపోయే ఏ ఒక్కరితోనూ సంప్రదించకుండా ఓట్లు, సీట్లే ప్రామాణికంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చడం సరికాదన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనతో కేంద్రం ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications