అసహ్యించుకుంటున్నా: సబ్బం, టిక్కెట్ ఇచ్చినా: ఎస్పీవై
తాను ఇక ఒక్కసారి మాత్రమే పార్లమెంటుకు వెళ్తానని, అది కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓటు వేసేందుకు మాత్రమే వెళ్తానని, ఆ తర్వాత వెళ్లనని సబ్బం చెప్పారు. తాను ఎన్నో ప్రభుత్వాలు చూశానని, కానీ నియంతలా వ్యవహరించడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకోకుంటే కాంగ్రెసు పార్టీకి ఇక్కడ పుట్టగతులుండవన్నారు.
రాజీనామాకు సిద్ధం: కన్నా
మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇంటిని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి కార్యకర్తలు ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల వల్లనే ఈ నిర్ణయం వెలువడిందని, రాజీనామాలే పరిష్కారమైతే అందుకు తాను సిద్ధమన్నారు.
టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసే ప్రసక్తి లేదు: ఎస్పీవై రెడ్డి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసే ప్రసక్తి లేదని ఎంపి ఎస్పీవై రెడ్డి అన్నారు. సీమాంధ్రలో ఒక్క సీటును కూడా కాంగ్రెసు గెల్చుకోలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజీనామాకు సైతం సిద్ధమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
స్వార్థపరుల ప్రయోజనాలు: తోట, కొండ్రు
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాము పోరాటం చేస్తున్నామని మంత్రులు తోట నర్సింహం, కొండ్రు మురళిలో వేర్వేరుగా అన్నారు. కానీ సమైక్యం ముసుగులో కొందరు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధఈ విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కొందరు స్వార్థపరుల ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, కాంగ్రెసు కార్యకర్తలు వారిని తిప్పి కొట్టాలన్నారు.
సోనియా ఫ్లెక్సీ ధ్వంసం
పలుచోట్ల రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేస్తున్నారు. గుంతకల్లులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో నెహ్రూ, రాజీవ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. కొన్నిచోట్ల చెప్పుల దండ కూడా వేశారు. చింతలపూడిలో రాజేష్ ఆధ్వర్యంలో సోనియా, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుల విగ్రహాలని దగ్ధం చేశారు. చనిపోయారంటూ ఏడ్చారు.