బాబు లెక్క తప్పు, రాజీనామా చేసినా తగ్గేది లేదు: డిగ్గీ
రాజధాని ఏర్పాటుపై బాబు లెక్క సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్లో తాను పర్యటిస్తానని, సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తొలగిస్తానని చెప్పారు. హైదరాబాదులో ఉండే వారు ఎలాంటి భయాందోళనకు లోనుకావొద్దని హితవు పలికారు. ఎవరైనా నిర్భయంగా ఉండవచ్చునని చెప్పారు. మంత్రులు రాజీనామా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. వాటి ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడదన్నారు.
విభజన జరుగుతున్నప్పుటు ఇలాంటి ఆందోళనలు, రాజీనామాలు సహజమేనని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం కొత్త రాజధానిని అద్భుతంగా నిర్మించుకోవచ్చునని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆందోళనలకు తాము పరిష్కారం చూపిస్తామని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. ప్రతిపక్షాలు తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఉండవని తాను అభిప్రాయపడుతున్నానని డిగ్గీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. మంచి వనరులు ఉన్నాయని తెలిపారు. కోస్తా తీర ప్రాంతం ఉందని, చండీగఢ్, గాంధీనగర్లలా కొత్త రాజధానిని తయారు చేసుకోవచ్చునని సూచించారు.
అంతా చట్ట ప్రకారమే: కమల్ నాథ్
తెలంగాణపై చట్టపరమైన ప్రక్రియ ఉందని, దాని ప్రమకారమే ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి కమల్ నాథ్ అన్నారు. తెలంగాణపై శాసన సభలో తీర్మానం చేయాల్సి ఉందన్నారు. మరోవైపు ఏఐసిసి కార్యదర్శి తిరునావక్కరసు హైదరాబాదుకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మరో కార్యదర్శి కుంటియా రానున్నారు.