అన్నకు కోపం: తెరాస నుంచి విజయశాంతి సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ రాములమ్మపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సస్పెన్షన్ వేటు వేసింది. గత కొంత కాలంగా పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. కాంగ్రెసులో చేరడానికి ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అన్న కెసిఆర్ చెల్లె విజయశాంతిపై ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. పైగా ఆ వార్తలను విజయశాంతి ఖండించలేదు.
విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి తర్వాత తెరాస పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని ఇప్పటికే అనేకసార్లు క్షమించాం. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని తెరాస ఆ ప్రకటనలో తెలిపింది.
తెరాసలో తనకు ప్రాధాన్యం తగ్గడంతో విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు మెదక్ పార్లమెంటు సీటు ఇవ్వడానికి కెసిఆర్ ఇష్టంగా లేరనే వార్తల వల్ల కూడా ఆమె కలత చెందినట్లు చెబుతున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో సమావేశమై మెదక్ పార్లమెంటు సీటుపై హామీ ఇప్పించుకున్నారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసులో చేరుతారనే ప్రచారంపై ఆమె సమాధానం ఇవ్వలేదు. 'కాంగ్రెస్లో చేరుతున్నారా? తెరాసకు గుడ్బై చెప్పినట్లేనా?' అని వచ్చిన వార్తలపై సూటిగా స్పందించలేదు. "ఈ ప్రచారం గురించి తర్వాత మాట్లాడుకుందాం. తెలంగాణపై ప్రకటన వచ్చిందనే సంతోషంలో ఉన్నాను. దానిని అలాగే ఉండనివ్వండి'' అని బదులిచ్చారు. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన ప్రకటన అద్భుతంగా అభివర్ణించారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్లో జరిగిన సంబరాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నిస్తే 'అనారోగ్య కారణాల వల్లే' అని బదులిచ్చారు.