బాబు టార్గెట్, జగన్కు కౌంటర్: మూకుమ్మడి రిజైన్లు!
హైదరాబాద్: యూపిఏ, సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు ప్రాంత ప్రజాప్రతినిధులు గురువారం వరుసగా రాజీనామాలు చేశారు. మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు క్యూ కట్టారు. ఇప్పటి వరకు 8మంది మంత్రులు, 25మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.
వారు వేర్వేరుగా స్పీకర్కు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలకు రాజీనామాలు సమర్పించారు. మరికొందరు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తద్వారా రాష్ట్రాన్ని విభజిస్తే దేనికైనా సిద్ధమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వారు స్పీకర్ ఫార్మాట్లో పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
ధిక్కరింపని విభజిస్తే వహిస్తే పార్టీకి గుడ్ బై!
అధిష్టానం తమను ధిక్కరిస్తున్నారని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైతే వారే పార్టీని విడిచి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. తమకు పార్టీ ముఖ్యమని అయితే ప్రస్తుతం తమ ప్రాంతాల్లో తాము తిరగలేని పరిస్థితుల్లో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము రాజీనామాలు సమర్పించకుంటే తమ ప్రాంతానికి ద్రోహం చేసిన వారమవుతామని అంటున్నారు.
రాష్ట్ర విభజనపై యూపిఏ, సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తాము కూడా ఉద్యమంలో పాల్గొంటామని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డే కారణమని వారు ఆరోపిస్తున్నారు. వారి లేఖల వల్లనే అధిష్టానం విభజన వైపు అడుగులు వేసిందని చెబుతున్నారు.
తెలుగుదేశంపై ఒత్తిడి - జగన్ పార్టీకి కౌంటర్
సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలకు తెర లేపడంతో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతల పైన ఒత్తిడి పడుతోంది. ఇన్నాళ్లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనలు, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల రాజీనామాల నేపథ్యంలో తాము బయటకు రాక తప్పని పరిస్థితి ఉందని భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి తెలియజేసినట్లుగా తెలుస్తోంది. తమ పైన ఒత్తిడి పెరుగుతోందని, తాము కూడా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు బాబుకు తెలియజేసినట్లుగా కూడా తెలుస్తోంది. కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమ రాజీనామా చేస్తానని అధినేతకు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
కాంగ్రెసు నేతల రాజీనామాలు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి పెంచేందుకేనని కూడా చెబుతున్నారు. ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని, వారు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినా తగ్గేది లేదని చెప్పారని, స్వయంగా సోనియాను కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఈ నేపథ్యంలో అధిష్టానం వెనక్కి తగ్గదని తెలిసినా సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో టిడిపిని టార్గెట్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా వారు రాజీనామాలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇంకోవైపు రాజీనామాలకు మొదట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తెర లేపినందున వారికి కౌంటర్గా కూడా ఈ రాజీనామాలు ఉపయోగపడుతాయని వారు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు.