అనంతలో ఉద్రిక్తత, మంత్రులకు సిఎం బుజ్జగింపు
హైదరాబాద్/అనంతపురం: తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి, యూపిఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రెండు రోజులుగా సీమాంధ్ర అట్టుడుకుతోంది. పదమూడు జిల్లాల్లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు వారిని ఆదేశించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మంత్రులకు సిఎం బుజ్జగింపు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. రాజీనామాలు చేస్తామని వారు చెప్పడంతో బొత్స, కిరణ్లు వారిని వారించినట్లుగా సమాచారం. ఇప్పటికే నిర్ణయం జరిగినందున మన ప్రాంతానికి ఏం కావాలో డిమాండ్ చేద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రులు వట్టి వసంత్ కుమార్, కాసు వెంకట కృష్ణా రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, శైలజానాథ్, గల్లా అరుణ కుమారి, గంటా శ్రీనివాస రావు, మహీధర్ రెడ్డిలు సిఎం, పిసిసి చీఫ్లతో భేటీ అయ్యారు.
రాజీనామాలు తెలియదు: స్పీకర్
శాసన సభ్యుల రాజీనామాల విషయం తనకు తెలియదని సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం చెప్పారు. యూపిఏ, సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర కాంగ్రెస పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల రాజీనామాపై నాదెండ్ల స్పందిస్తూ తనకు తెలియదని చెప్పారు.
కెవిపి ఇంట్లో సీమాంధ్ర ఎంపీల భేటీ
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు ఇంట్లో రాత్రి పది గంటలకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు భేటీ కానున్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదముద్ర వేసిన అనంతరం నెలకొన్ని పరిస్థితులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు.
విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర
అనంతపురం నగరంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల కుట్ర ఉందని డిసిసి అధ్యక్షుడు మధుసూధన్ ఆరోపించారు. సమైక్యాంధ్ర ముసుగులో ఆ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఏ ప్రాంతాకనికి నష్టం జరగదు: జానా
ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, సీమాంధ్రులు సంయమనం పాటించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి విజ్ఞప్తి చేశారు.