అగ్గి రాజేసిన కెసిఆర్: ప్రకటనపై భగ్గుమన్న నేతలు
'ఉద్యోగులను పొమ్మనే అధికారం కేసీఆర్కు ఎక్కడిది? ఆయన ముఖ్యమంత్రా?' అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులు ఎవరు, ఎక్కడ ఉండాలనేది విభజనపై నియమించే అధికారిక కమిటీ చూసుకుంటుందని, వారి ఆప్షన్ ప్రకారం ఎక్కడ ఉండాలనేది పర్యవేక్షిస్తుందని, ఉద్యోగులను పంపించడం కెసిఆర్కు సాధ్యం కాదని, బహుశా ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని కెసిఆర్ భావిస్తున్నటుందని పాల్వాయి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రావడంవల్ల తనకు లబ్ధిచేకూరదని కెసిఆర్ భావిస్తున్నారేమోనని, తెరాస కాంగ్రెస్లో విలీనమైతే కెసిఆర్ మాటలు, అభిప్రాయాలకు విలువ ఉండదని, కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకుంటుందని అన్నారు.
ఉద్యోగుల స్థాన చలనం మొత్తం విధివిధానాలు, సర్వీసు నిబంధనల ప్రకారమే జరుగుతుందని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటితో తెలంగాణకు సంబంధం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అవి దురుద్దేశంతో కూడినవేనని అభిప్రాయపడ్డారు.
విభజనకు అడ్డంకి: విజయశాంతి
సీమాంధ్ర ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేలా కెసిఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని తెరాస బహిష్కృత నేత, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. కెసిఆర్ తీరు పుండుమీద కారం చల్లినట్లుగా ఉందన్నారు.
హైదరాబాద్ కెసిఆర్ సొంత జాగీరు కాదని, ఎవరు ఎక్కడ ఉండాలన్నది ఆయన నిర్ణయించలేరని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. కెసిఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు. కెసిఆర్ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, హైదరాబాద్లో సీమాంద్రులకు అన్యాయం జరిగితే ఇక్కడి నుంచి యావత్ ప్రజలు తరలివచ్చి నగరాన్ని ఆక్రమించుకుంటారని హెచ్చరించారు.
ఉద్యోగుల్ని పొమ్మనేందుకు హైదరాబాద్ ఏమైనా కెసిఆర్ బాబు సొత్తా అని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విభజన జరగకముందే కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కెసిఆర్ నైజం బయటపడిందని, ఇప్పటికైనా కేంద్రం వాస్తవాన్ని గ్రహించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన అన్నారు. పొమ్మనే హక్కు కెసిఆర్కు ఎక్కడిదని మరో మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు.
కెసిఆర్ వ్యాఖ్యలు అసందర్భమని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వత, తొందరపాటుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవారికి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని, రాష్ట్ర సాధనకు సమస్యలెదురవుతాయని నారాయణ అన్నారు.