వైయస్ మృతి తర్వాతే టి, మా పార్టీ తప్పుంది: దేవినేని
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తప్పు కూడా ఉందని చెప్పారు. అయితే ప్రాంతీయవాదం ఎగిసినప్పుడు కొందరు నేతలు పాదయాత్రలకు వెళ్లి ఒక్కో రకంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలు రాజకీయం కోసం తెలంగాణను ఎత్తుకున్నారన్నారు.
ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె అగ్నిగుండంలా మారిందన్నారు.
రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో దానిపై పాలకులు మనసు పెట్టలేదని విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి నాయకులు కలిసికట్టుగా ఉద్యమించాలని సూచించారు.
కాగా ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ కార్మికులు, పర్చూరులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతపురంలో మంత్రి రఘువీరా రెడ్డి ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు రాజీనామాకు పట్టుబట్టారు. ఏలూరులో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంటిని ముట్టడించారు. మరోవైపు కర్నూలులోని డిసిసి కార్యాలయం వద్ద మంత్రి టిజి వెంకటేష్ రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు.