మోడీ యువభారత్పై ఆసక్తి: లక్ష మంది నమోదు
హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నవభారత్ యువభేరీ సభపై యువత అనూహ్యమైన ఉత్సుకత ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హాజరయ్యే వంద ర్యాలీల్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభ మొదటి కావడం విశేష. రాజకీయంగా ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
నరేంద్ర మోడీ నవభారత్ యువభేరీకి హాజరు కావడానికి ఇప్పటి వరకు లక్ష మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సభ జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిలో 50 శాతం మందికి పైగా సభకు హాజరవుతారని అంటున్నారు.
ఇప్పటి వరకు సభకు రావడానికి పేర్లు నమోదు చేయించుకున్నవారిలో మూడొంతుల వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉన్నారు. తర్వాత తెలంగాణ జిల్లాల నుంచి, సీమాంధ్ర ప్రాంతం నుంచి కూడా మోడీ సభకు వచ్చేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. మోడీ సభకు పేర్ల నమోదుకు హైదరాబాదులోని 20 ప్రధాన ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నరేంద్ర మోడీ నవభారత్ యువభేరీపై సామాజిక వెబ్సైట్లలో బిజెపి నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. నేరుగా సభకు రాలేనివారిని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక పరిజ్ఝానాన్ని విస్తృతంగా వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బిజెపి ఇంటర్నేట్ టీవీ yuva4indiaలో నవభారత యువభేరీ సభను ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.
యువభేరీ సభ 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లాల్లో సినిమా థియేటర్లలో మోడీ సభను ప్రసారం చేయనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన బిజెపి నేతలు 11వ తేదీన స్థానిక థియేటర్లలో మ్యాట్నీ షోలో మోడీ సభను ప్రసారం చేయాలనే యోచనలో ఉన్నారు. ఈ ప్రతిపాదనపై బిజెపి రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications