జగన్ను కలిసిన షర్మిల, జలగం అనుచరుల ఝలక్
షర్మిల కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు మరో ప్రజా ప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 18న ప్రారంభమైన ఈ యాత్ర నిన్నటి(ఆదివారం)తో ముగిసింది. పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వచ్చిన షర్మిలకు విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. షర్మిల విమానాశ్రయం నుండి నేరుగా జైలు వద్దకు చేరుకొని సోదరుడిని కలుసుకున్నారు.
జలగం అనుచరుల ఝలక్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అనుచరులు మూసివేశారు. ఇటీవలి కాలంలో జలగం వెంకట్రావ్కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు జలగం కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
దీంతో జలగం అనుచరులు పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటంతో వెంకట్రావ్ కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జోరందుకొంది. దీంతో జలగం వర్గం కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని మూసివేశారని అంటన్నారు. పార్టీ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను తొలగించారు.