పునఃపరిశీలన అసాధ్యం, టిడిపికి థ్యాంక్స్: టిపై జానారెడ్డి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 60 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోందన్నారు. తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టులు, మేధావులు పాత్ర ఎంతో ఉందన్నారు. వారు చాలా పోరాటం చేశారని, అభినందనీయమన్నారు. ఆవేశంతోనే సీమాంధ్ర సోదరులు ఆందోళన చేస్తున్నారన్నారు. అందరూ అపోహలు వదిలేసి రాష్ట్ర విభజనకు సహకరించాలని, రెండు రాష్ట్రాలుగా ఉండే ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
అన్నదమ్ములుగా విడిపోయి.. తెలుగువారిగా కలిసుందామన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర వాళ్లకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జఠిలమైన సమస్యపై కాంగ్రెసు పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలంగాణ మొత్తం హైదరాబాదులా కనిపించేంత అభివృద్ధి చేసుకుందామన్నారు.
ఇరు ప్రాంతాల్లో సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కేంద్రం ఇన్నాళ్లు వెనక్కి తగ్గినప్పటికీ తాము ఓపిక పట్టామన్నారు. రెండు రాష్ట్రాలు కూడా దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు. తెలంగాణపై పునఃపరిశీలన అసాధ్యమని దీనిని అందరూ గుర్తించాలని కోరారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన అని గుర్తించాలన్నారు.
హైదరాబాద్పై అభ్యంతరాలు వింటారు: పొన్నం
హైదరాబాదు పైన సీమాంధ్రులకు అభ్యంతరాలు ఉంటే కేంద్రం, తమ పార్టీ అధిష్టానం వింటుందని, వారి ఆందోళనలను తొలగిస్తుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా కోరారు. విభజనకు అందరూ సహకరించాలన్నారు.