భద్రాచలం తెలంగాణదే, ఆంధ్రాకు సరికాదు: మల్లుభట్టి
ఖమ్మం: భద్రాచలం తెలంగాణదేనని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అన్నారు. భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపాలనడం సహేతుకం కాదని ఆయన చెప్పారు. అక్కడి రామాలయాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతోనే 17వ శతాబ్దంలో రామదాసు నిర్మించాడని చెప్పారు.
ఆ నాటి నుంచే గోల్కొండ పాలకులు సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు పంపే సంప్రదాయం ఉందని చెప్పారు. అది నేడు ముఖ్యమంత్రులు తలంబ్రాలు తీసుకువెళ్లేలా ఆనవాయితీగా మారిందని, నాటి గోల్కొండ ప్రాంతానికి భద్రాచలంతో సంబంధాలు ఉన్న విషయం మరువరాదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమలుచేసే వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాన్ని పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, నేత గౌరవించాల్సిందేనన్నారు.
ఏ ప్రాంతానికి, ఎవరికీ అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భట్టి చెప్పారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఆ నగరం ఉంటుందని చెప్పారు. తమదే హైదరాబాద్ అని చెప్పే హక్కు కానీ, అక్కడ పనిచేసే ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు కానీ ఎవరికీ లేదని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలనుద్దేశించి అన్నారు.