మూడో వారంలో అసెంబ్లీ: శ్రీధర్ ద్వారా టీ తీర్మానం?

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 2009లో తెలంగాణపై తీర్మానం చేసినట్లు ఆయన చెబుతున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు సాగనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు.
ముఖ్యమంత్రి మాత్రమే తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఏమీ లేదని, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చునని ఆయన అంటున్నారు. శ్రీధర్ బాబు తెలంగాణకు చెందిన మంత్రి కావడంతో ఏ విధమైన ఆటంకాలు ఉండవని చెబుతున్నారు.
తీర్మానంపై ఏ ఒక్క సభ్యుడు వోటింగ్కు అడిగినా అందుకు స్పీకర్ అనుమతించాల్సిందేనని చెబుతున్నారు. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కాంగ్రెసు ఏ విధమైన విప్ కూడా జారీ చేసే అవకాశం లేదని సమాచారం. దాన్ని సభ్యుల వ్యక్తిగత అభిప్రాయానికి వదిలేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సీమాంధ్ర సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తెలంగాణపై తీర్మానం నెగ్గే అవకాశాలు లేవు. అయితే, రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం నెగ్గాల్సిన అవసరం ఏమీ లేదని, శాసనసభ అభిప్రాయం తెలిపితే చాలునని నిపుణులు అంటున్నారు. అయితే, అధికారిక తీర్మానం వీగిపోతే నైతికపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఈ పరిణామాలకు సిద్ధపడే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications