ఇరు ప్రాంతాల మధ్య రాజీ చేస్తాం: దిగ్విజయ్ సింగ్
ఇరు ప్రాంతాల ప్రతినిధుల మధ్య సయోధ్యను కుదర్చడం తమ తొలి కర్తవ్యమని చెప్పారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్పై తమతమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా వెల్లడించాలని కోరినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ నిర్మించే ఉన్నతస్థాయి కమిటీకి అందజేయనున్నట్టు వివరించారు. ఇరుప్రాంతాల ప్రజలూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ తదితర జాతీయ నేతల విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. నిరసనలు శాంతియుతంగా వుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డికి సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి ఏకే ఆంటోని నేతృత్వంలో హైలెవల్ కమిటీ ముగ్గురు సభ్యులతో ఏర్పడుతుందని దిగ్విజయ్సింగ్ అన్నారు. తాను కూడా అందులో సభ్యుడిగా ఉంటానని అన్నారు. తనవద్దకు వచ్చిన విజ్ఞప్తులను ఆంటోని కమిటీ ముందు ఉంచడం జరగుతుందన్నారు. కమిటీలో తనతోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు.
కాగా దిగ్విజయ్ని కలిసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలన్న విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందించారు. దీనిపై ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా 20 మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.