విభజన: మీడియా ముందుకు కిరణ్ రెడ్డి వస్తారా?
శనివారం సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమయంలో తన మనసులోని మాటను ఆయన వారితో పంచుకున్నట్లు చెబుతున్నారు. తాను యాభై ఏళ్ల వయస్సులోని ముఖ్యమంత్రిని అయ్యానని, ఇంతకన్నా ఉన్నత స్థాయికి వెళ్లలేకపోయినా ఫరవా లేదు గానీ తన చేతుల మీదుగా విభజన ప్రక్రియను నడిపించడానికి సిద్ధంగా లేనని ఆయన వారితో చెప్పినట్లు సమాచారం. ఈ దశలో తన పదవి పోయినా ఫరవాలేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణపై ప్రకటన వెలువడిన జూలై 30వ తేదీనుంచి ఇప్పటి వరకు వరకూ కిరణ్ సచివాలయానికి వెళ్లలేదు. క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. పాలనను అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. పార్టీ పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ తీర్మానం శాసనసభలో గట్టెక్కే పరిస్థితులు లేవని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏర్పాటైన రాష్ట్రాలన్నీ అసెంబ్లీ తీర్మానం ద్వారానే ఏర్పాటయ్యాయని ఆయన చెబుతున్నారు. తీర్మానం ఆమోదం పొందడం తప్పనిసరికాకపోయినా వీగిపోతే మాత్రం ప్రక్రియ కొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కిరణ్ భావిస్తున్నారని సమాచారం. అదే జరిగితే, సార్వత్రిక ఎన్నికల వరకూ తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, అప్పటికి కొత్తగా తలెత్తే సమస్యలు ఈ అంశాన్ని అధిగమించే అవకాశం ఉంటుందని కిరణ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, వాటికిగల కారణాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించే ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి ఆయన శనివారమే మీడియా ముందుకు రావాలనుకున్నారని, కానీ ఆ రోజున సీమాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో రాత్రిపొద్దుపోయే దాకా సమావేశం జరగడం, ఇతర కార్యక్రమాలతో అది కుదరలేదని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో కిరణ్ రాష్ట్ర ప్రజలకు పరిస్థితులు వివరిస్తారని, తద్వారా సీమాంధ్రలో ఉద్రిక్తతలు తగ్గించాలని భావిస్తున్నారని అంటున్నారు.