స్పీకర్ హామీతో ఆందోళన విరమణ, వెల్లోకి సుజనా
న్యూఢిల్లీ: లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తమ ఆందోళనను విరమించారు. స్పీకర్ మీరా కుమార్ విజ్ఞప్తి మేరకు వారు తమ ఆందోళనను విరమించారు. పార్లమెంటు సమావేశాలు రెండో రోజైన మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. అనంతరం పన్నెండు గంటలకు ప్రారంభమయ్యాయి.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఎంపీల నిరసన గళం ఆగలేదు. దీంతో లోకసభ స్పీకర్ మీరా కుమార్ తర్వాత చర్చించుదామని ఎంపీలకు సూచించారు. స్పీకర్ విజ్ఞప్తి మేరకు ఎంపీలు ఆందోళనను విరమించారు. రాజ్యసభలోను చైర్మన్ ఇదే సూచన చేశారు. ఎంపిలు ఏమాత్రం తగ్గకుండా స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు తాము తగ్గేది లేదన్నారు. రాజ్యసభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అస్పష్ట ప్రకటనతో కాంగ్రెసు పార్టీ సమస్యను మరింత జఠిలం చేసిందని బిజెపి నేత వెంకయ్య నాయుడు విమర్శించారు.
ఆజాద్తో భేటీ
సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అంశాన్ని తేల్చాలన్నారు. అనంతరం వారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంను కలువనున్నారు.
సీమాంధ్రుల ఆందోళనను అర్థం చేసుకున్నాం: కమల్ నాథ్
తాము సీమాంధ్ర ప్రజలు, నేతల ఆందోళనను అర్థం చేసుకున్నామని కమల్ నాథ్ అన్నారు. వారి వాదన వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వెల్లోకి దూసుకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీకి నేతలు
సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్, కొండ్రు మురళీలు హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లాబీయింగ్ కోసం వారు బయలుదేరారు.