కెసిఆర్ను చంపే అవసరం ఎవరికీ లేదు: సోమిరెడ్డి
తన ఎజెండా మావోయిస్టుల ఎజెండాయేనని కెసిఆర్ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. కెసిఆర్ తెలంగాణాలో ఇంటింటికీ లైసెన్సు లేని తుపాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే ముఖ్యమంత్రి ఇంట్లో ఫిడేలు వాయిస్తూ కూర్చుంటారా అని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలనూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో ఎందుకు మాట్లాడుతారో, ఎప్పుడు ఎక్కడ మాట మార్చుకుంటారో అర్థం కాదని ఆయన మండిపడ్డారు. "ఒకరు ఇక్కడేమో పదవులు త్యజిస్తామంటారు, ఢిల్లీ పోగానే మాట మార్చేస్తారు, బొత్స రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటంటారు, తిరుపతి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని దేవుణ్ణి మొక్కుకున్నానంటారు, మళ్లీ ఆయనే ఢిల్లీ వెళ్లి మీరు ఎలా చెబితే అలా అంటారు ఇదేం పద్ధతి" అని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో దురదృష్టకరమైన నాయకత్వం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభిన్నమైన ప్రకటనలు చేస్తారని, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు మరోటి మాట్లాడుతారని, డిప్యూటీ సిఎం ఇంకోటి మాట్లాడుతారని ఆయన అన్నారు. రాయల తెలంగాణ అని ఒకరు, తెలంగాణ అని మరొకరు - ఇలా విభన్నమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల అనుమానాలు తీర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెసు విభజన చిచ్చు పెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేసిందని ఆయన విమర్శించారు.