సమైక్య నినాదాలు: 5 నిమిషాలకే లోకసభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటులో రెండో రోజు కూడా విభజన వేడి రాజుకుంది. ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభం కాగానే సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా, సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని నిరసన తెలిపారు.
లోకసభలో సభ్యులు వెల్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. స్పీకర్ మీరా కుమార్ వారిని వారించినప్పటికీ వినలేదు. దీంతో రెండో రోజు సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే లోకసభ గంట వాయిదా పడింది. రాజ్యసభలోను విభజన విషయమై సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో తాము చర్చిస్తామని కమల్ నాథ్ చెప్పారు.
టిడిపి ఎంపీల ధర్నా
పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద సీమాంధ్ర టిడిపి ఎంపీలు రెండో రోజు కూడా ధర్నా చేపట్టారు. తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదు కానీ: మోదుగుల
తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని కానీ, తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన తాము పోరాటం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నదీ జలాల వాటా, రెవెన్యూ, రాజధాని తదితర అంశాలపై తమకు పూర్తి స్పష్టత కావాలన్నారు.