తెలంగాణలో జగన్: హీరో శ్రీహరి పోటీ ఎక్కడి నుండి?
ఆస్తుల కేసులో జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవక ముందే శ్రీహరి ఆ పార్టీలో చేరుతారని, నగరం నుండి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాలుగైదు నెలల క్రితం శ్రీహరి జైలులో జగన్ను కలిశారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో శ్రీహరి నగరం నుండే పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. శ్రీహరికి సేవాభావం ఎక్కువ. దీంతో ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా గెలిపించుకుంటామని అభిమానులు చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణ అంశం కారణంగా శ్రీహరి ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది.
తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పిన శ్రీహరి.. ఎక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పలేదు. ఆయన పుట్టి పెరిగిన బాలానగర్ ప్రాంతంలో మంచి పట్టుంది. దీంతో నగరం నుండి పోటీ చేస్తారని అందరు భావించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా నగరం నుండి శ్రీహరిని పోటీ చేయించాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన సమైక్యవాద ముద్ర పడింది. దీంతో తెలంగాణలోని ఇతర జిల్లాల నేతలతో పాటు హైదరాబాదులోని నేతలు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీహరి హైదరాబాదులో ఏదో ఒక నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసే సాహసం చేస్తారా? లేక ఆయన విభజనపై ఎలాంటి కామెంట్స్ చేయనందున సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేస్తారా? అలాకాకుండా స్వతంత్ర సభ్యుడిగా పోటీ చేస్తారా? అనే చర్చ సాగుతోంది.