సీతయ్య: అంతర్మథనం నుండి బయటపడిన కిరణ్!
హైదరాబాద్: విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత పెదవి విప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా తన మనోగతాన్ని విప్పినట్లుగా చెప్పవచ్చు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు కాంగ్రెసు పార్టీ ప్రకటన తర్వాత కూడా సమైక్యాంధ్ర నుండి వెనక్కి వెళ్లనట్లుగానే కనిపిస్తోంది. అయితే ఇన్ని రోజులకు ఆయన ఎందుకు బయటకు వచ్చారనేది అందర్నీ తొలుస్తోంది.
వార్రూంలో విభజనపై తర్జన భర్జనలు జరిగిన సమయంలోనే విభజన ప్రక్రియలో తాను పాలుపంచుకోలేనని కిరణ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా కాంగ్రెసు ముందుకు అడుగులు వేసింది. దీంతో దశాబ్దాలుగా నెహ్రూ కుటుంబంతో ఉన్న అనుంబంధం మేరకు అధిష్ఠానం మాటకు కట్టుబడి విధేయుడిగా ఉండాలా? లేక మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలా అనే అంతర్మథనం కిరణ్ ఇన్నాళ్లు పడి ఉంటారంటున్నారు.
ఈ క్రమంలోనే సీమాంధ్రలో ఉద్యమం వెల్లువెత్తడం, ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తుండటం, ఢిల్లీ పెద్దలు రోజుకో ప్రకటన చేస్తున్న క్రమంలో కిరణ్ బయటకి వచ్చి తన మనోగతాన్ని చెప్పారంటున్నారు. గత శనివారమే ఆయన మీడియా సమావేశం పెడతారని ప్రచారం జరిగింది. అయితే అధిష్ఠానం వైఖరిపై ఆవేదన, ఆక్రోశంతో రగులుతున్న ముఖ్యమంత్రి మూడ్ను కాంగ్రెస్ పెద్దలు ముందే గమనించారని, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారట.
అయితే గురువారం మీడియా ముందుకు వచ్చిన కిరణ్ మొదట అధిష్టానం సూచించినట్లుగా.. ఆందోళనకారులకు, ఉద్యోగులకు విజ్ఞప్తులు చేశారు. సమ్మెలు వద్దని కోరారు. సమస్యలుంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకునేందుకు అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన సీమాంధ్ర ప్రజల మనోభవాలు, వారి ఆవేదన, ఆందోళనలపై మాట్లాడారు. నదీజలాల పంపిణీ మొదలుకొని విద్యుత్, విద్య, వైద్యం, ఉద్యోగాలు తదితర కీలకాంశాల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అన్నింటిని ఎలా పరిష్కరిస్తారు? వీటన్నింటికి సమాధానం చెప్పాకే విభజన ఆలోచన చేయాలంటూ తన వైఖరి స్పష్టం చేశారు.
కిరణ్ మాట్లాడిన తీరు, ఆయన హావభావాలను పరిశీలిస్తే తాను చెప్పదలుచుకున్నదేదో చెప్పేస్తే ఆపై అధిష్ఠానం ఇష్టం అన్న ధోరణి కనిపిస్తోందని అంటున్నారు. తానేమీ పార్టీ నిర్ణయం ధిక్కరించడం లేదని చెబుతూ వాస్తవాలు చెబుతున్నానన్నారు. తాను అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరుప్రాంతాల ప్రజల మనోభావాలను హైకమాండ్కు చెప్పలి కదా అంటున్నారు.
మరోవైపు విభజన అనివార్యమైన పక్షంలో సీమాంధ్ర ప్రజల్లో తన పట్ల వ్యతిరేక భావం ఉండకూడదు.. తన హయాంలో రాష్ట్ర విభజన జరిగిందన్న అపవాదు చర్రితలో మిగిలిపోకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇలా బయటపడి ఉండవచ్చునని కూడా అంటున్నారు. మరోవైపు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండగా విభజన జరిగే అవకాశాలు లేవనే వారు కూడా లేదు. కిరణ్ స్వయంగా తానే తాను మొండివాడినని పరోక్షంగా పలుమార్లు చెప్పారు. ఎవరికో భయపడనని, తాను చేయాలనుకున్నది మంచి అనుకుంటే చేస్తానని పలు సందర్భాలలో చెప్పారు.