కెసిఆర్కు విలీనం సెగ: కాంగ్రెసు వైపు ఎమ్మెల్యేలు?
కెసిఆర్ మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్లో బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెసుకు తెరాస దగ్గరతువుతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విలీనం కూడదనే డిమాండ్ ఊపందకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెసులో విలీనం చేస్తే తమకు టికెట్లు లభిస్తాయా, లేదా అనే అనుమానం తెరాస నాయకులను పీడిస్తున్నట్లు సమాచారం.
అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాకుండానే తెరాస నుంచి కాంగ్రెసులోకి వలసలు పెరుగుతున్నాయి. దీన్ని ఆపడం కెసిఆర్కు ఓ సవాల్గా మారింది. మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి గత వారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆమె కాంగ్రెసులో చేరడం ఖాయమైపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సీనియర్ తెరాస నేతలు విజయరామారావు, ఎ. చంద్రశేఖర్ కూడా తాము కాంగ్రెసులో చేరుతున్నట్లు ప్రకటించారు.
తెరాసకు చెందిన 17 మంది శాసనసభ్యుల్లో 8 మంది కాంగ్రెసులో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడమా, పార్టీని కట్టుదిట్టంగా ఉంచుకోవడమా అనే సందేహంలో కెసిఆర్ కొట్టుమిట్టాడుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతున్న కొద్దీ తెరాసలో ఆందోళన పెరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా కాంగ్రెసులో చేరి, టికెట్లు ఖాయం చేసుకోవడమా, లేదంటే విలీనం వరకు ఆగాలా అనే సందేహంలో తెరాస నాయకులు సతమతమవుతున్నారు.
చివరి నిమిషలంలో పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని కెసిఆర్ నిర్ణయం తీసుకుంటే తమకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తగ్గుతాయని చాలా మంది భయపడుతున్నారు. కాంగ్రెసులో విలీనం చేస్తే ఆ పార్టీలో టికెట్లు సంపాదించుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయంతో వారున్నారు. విలీనంపై కెసిఆర్ త్వరగా నిర్ణయం తీసుకుంటే ఏదో ఒకటి తేల్చుకోవచ్చుననే ఉద్దేశంతో ఉన్నారు. విలీనం చేయకుండా, కెసిఆర్ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.