అభివృద్ధే లక్ష్యం, ఎంతో సాధించాం: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల పింఛనును 4 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో ప్రగతి సాధించామని ఆయన చెప్పారు.
తమ ప్రభుత్వం నెహ్రూ, ఇందిరా గాంధీ చూపించిన సంక్షేమ బాటలో నడుస్తోందని ఆయన చెప్పారు. మీ సేవ నిశబ్ద విప్లవం సాధించిందని ఆయన చెప్పారు. సమస్యనలను అర్థం చేసుకుని పరిష్కారం చేసుకునే ప్రజాస్వామ్యాన్ని మనం రూపొందించుకున్నట్లు ఆయన తెలిపారు. అంబేడ్కర్ స్ఫూర్తితో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందడుగు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అభయ హస్తం పథకాన్ని మరో 9 లక్షల మందికి వర్తింపజేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మూడో దశ రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ బాట కింద ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తమదేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, గత తొమ్మిదేళ్లుగా తలసరి ఆదాయం జాతీయ స్థాయి కన్నా ఎక్కువ నమోదైందని చెప్పారు. పది శాతం వృద్ధి రేటు సాధించే దిశగా సాగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బంగారు తల్లి పథకాన్ని చేపట్టి దానికి చట్టబద్దత కల్పించామని, మే 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు 50 వేల ఆడపిల్లలను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళా గ్రూపులను ఆదుకుంటూ 16,500 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రైతులు సకాలంలో చెల్లించిన రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోందని ఆయన చెప్పారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్ల విరామం తర్వాత 20 సూత్రాల పథకం అమలులో దేశంలో ప్రథమ స్థానం సాధించినట్లు చెప్పారు.
సకాలంలో వర్షాలు పడడం పల్ల జలాశయాలు నిండాయని, దీంతో విద్యుత్ సమస్య పూర్తిగా తీరుతుందని ఆయన చెప్పారు. మైనారిటీ సంక్షేమ పథకాలకు నిధులు పెంచామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు పనులు త్వరగా పూరప్తి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోనూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ మరిన్ని అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా నిరుపేదలకు అందించేందుకు పనిచేస్తోందని ఆయన చెప్పారు.