కాంగ్రెసుకు ఝలక్: జగన్ పార్టీలో చేరిన కేతిరెడ్డి
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో ఆందోళనలకు దిగింది. సమైక్య నినాదాన్ని అందుకుని ఆందోళనలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని పలువురు నాయకులు వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్మినేని సీతారాం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సీతారాం తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.