రగులుతున్న హైద్రాబాద్: హరీష్ అరెస్ట్, ఆఫీసుల్లో టెన్షన్
హైదరాబాద్: విభజన అంశంపై రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య పోటా పోటీ నెలకొంటోంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. సోమవారం బస్ భవన్, విద్యుత్ సౌధ, అరణ్య భవన్, భీమా భవన్ తదితర ప్రభుత్వ కార్యాలయాలలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీగా నినాదాలు చేశారు.
విద్యుత్ సౌధ వద్ద ఇరు ప్రాంతాల ఉద్యోగులు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్లు వచ్చారు. వారిని పోలీసులు లోనికి అనుమతించలేదు.
దీంతో వారు బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు కూడా అంగీకరించరా అని ప్రశ్నించారు. సీమాంధ్ర నేతలను లోపలకు అనుమతిస్తున్న వారు తమను ఎందుకు పంపించరన్నారు. తెలంగాణ వారి పైన సీమాంధ్రలో దాడులు జరుగుతున్నాయని, భద్రత కావాల్సింది తమకే అన్నారు.
కాగా, పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు హరీష్, ఈశ్వర్, విద్యాసాగర్లను అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసన 27వ రోజుకు చేరుకుంది. సి బ్లాక్ ముందు ఉద్యోగులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.