ఢిల్లీలో టిడిపి ఎంపీల దీక్ష, విభజన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/హైదరాబాద్: సస్పెన్షన్కు గురైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సోమవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సభను అడ్డుకుంటున్నందున నలుగురు టిడిపి, ఎనిమిది మంది కాంగ్రెసు ఎంపీలను స్పీకర్ మీరా కుమార్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో సస్పెండైన టిడిపి ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలు గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. మరోవైపు, అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన కోసి పరిక్రమ యాత్ర ఉభయ సభలను సోమవారం కుదిపేసింది. దీంతో లోకసభ, రాజ్యసభలను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ను కేంద్రమంత్రి కమల్ నాథ్ కలిసి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా
ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 2వ తేదికి వాయిదా వేసింది. ఈ రోజు ఎపిఎన్జీవోలు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే వారు కౌంటర్ దాఖలుకు శుక్రవారం వరకు గడువు అడిగారు. దీంతో హైకోర్టు కేసును సోమవారానికి వాయిదా వేసింది.
ఈ సమయంలో కోర్టు సమ్మెపై స్పందించింది. సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన నిర్ణయాన్ని వెల్లడించాలని ఆదేశించింది. సమ్మెలు న్యాయబద్దంగా జరుగుతున్నాయా లేదా అని మాత్రమే పరిశీలిస్తామని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొంది.
పిటిషన్ కొట్టివేత
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. కేంద్రం నిర్ణయం రాకుండా పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది.
నిజాం కళాశాల వద్ద ఉద్రిక్తత
నిజాం కళాశాల వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్తత తలెత్తింది. విద్యార్థులు గన్ పార్కు వరకు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు సంఘీభావంగా టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ వచ్చారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఈటెలను అదుపులోకి తీసుకున్నారు.