జైల్లో మూడోరోజు దీక్ష: ఢిల్లీలో జగన్ పార్టీ, తెరాస నేతలు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఈ రోజు మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రధానమంత్రిని, మధ్యాహ్నం 1.00 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. వారు సీమాంధ్ర ఉద్యమాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
బాబు యాత్ర మభ్యపెట్టేందుకే: జగన్ పార్టీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు ఆత్మగౌరవ యాత్ర ప్రజలను మభ్య పెట్టేందుకేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడిని ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజించారన్నారు. జగన్ సమైక్యాంధ్ర కోసమే దీక్ష చేస్తున్నారన్నారు.
ఢిల్లీకి తెరాస నేతలు
వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి తెలంగాణ అంశంపై వివరించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల కమలాకర్లు ఢిల్లీకి బయలుదేరారు.