నేను సమైక్యవాదిని, విభజనకు వ్యతిరేకిని: కిరణ్ రెడ్డి
హైదరాబాద్; ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను సమైక్యవాదినేనని, విభజనకు వ్యతిరేకినని ఆయన తెలిపారు. ఉద్యమాల సందర్భంలో మీరు ఇలా ప్రశ్నించారు, అయినా సమాధానం చెబుతానంటూ కేంద్ర సర్వీసుల అధికారులతో ఆ విధంగా అన్నారు.
మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో కేంద్ర సర్వీసులు, ఐఎఫ్ఎస్ అధికారులకు ఫౌండేషన్ కోర్సుల శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి కొందరు ట్రైనీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాజకీయాల్లో అవినీతి సాధారణమేనని, అయితే వారి సంపాదన మళ్ళీ ప్రజల వద్దకే వెళుతుందని చెప్పారు. ఇది కూడా ఉండరాదన్నదే తన అభిప్రాయమని ముఖ్యమంత్రి చెప్పారు.
వాణిజ్యవేత్తల వద్ద, పెట్టుబడిదారుల వద్ద ఉన్న నల్లధనం సమాజంలోకి రాదని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ ఓక్కరూ గెలిచే పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. తన తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన హయాంకు చాలా తేడా ఉందని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ అభ్యర్ధులు ఎన్నికల్లో పెట్టే ఖర్చు భారీగా పెరిగిపోయిందని కిరణ్ రెడ్డి అన్నారు. డబ్బు ఖర్చు పెట్టడం వల్ల కొన్ని ఓట్లు పడతాయన్న ఆశ అభ్యర్ధులకు ఉంటుందని, ఇది కొంత వాస్తవమేనని వివరించారు.
రాజకీయ నాయకులు ఐదేళ్ళకోసారి ప్రజలు పెట్టే పరీక్షను నెగ్గాల్సి ఉంటుందని, అధికారులు అలా కాదని, ఒక్కసారి పరీక్ష పాసైతే 30-35 ఏళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు బాధ్యులుగా లేకపోతే ప్రభుత్వాన్ని విసిరిపారేస్తారని, అందుకే వారి అవసరాలేమిటో తెలుసుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి అధికారులు కూడా సహకరించాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి అధికారులు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని అన్నారు.