అలా ఐతే బహిష్కరిస్తారు: రిపోర్టుతో ఢిల్లీ ఫ్లైటెక్కిన కిరణ్!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నివేదికతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు! ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం తదనంతర పరిణామాలతో కిరణ్ ఢిల్లీ వెళ్లారని సమాచారం. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంపై ఆయన పూర్తి నివేదికను ఎకె ఆంటోని కమిటీకి ఈ రోజు రాత్రి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
అంతకుముందు కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే లాభం చేకూరుతుందని, ఏదైనా సాధించవచ్చునని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారులేనని, అలా కాని పక్షంలో ప్రజలు వారిని బహిష్కరిస్తారని చెప్పారు. ఆయన మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మాట్లాడారు. అక్కడ కొత్తగా కేంద్ర సర్వీసులకు ఎంపిక అయిన అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
సామాజానికి రాజకీయ అవినీతి మంచిది కాదని చెప్పారు. పారదర్శకతే అవినీతి నిర్మూలనకు తొలి మెట్టు అని చెప్పారు. ఎన్నికలను డబ్బు ఏమాత్రం ప్రభావితం చేయలేదని, ఓటరు చాలా తెలివైన వారని అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఏదీ సాధ్యం కాదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేర్చాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
4 నుండి 10 వరకు ఆంక్షలు: అనురాగ్ శర్మ
ఈ నెల నాలుగో తేది నుండి 10వ తేది వరకు నగరంలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ఎవరైనా నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతులు తప్పని సరి అన్నారు. సచివాలయం, అసెంబ్లీలకు రెండు కిలోమీటర్ల దూరంలో 144వ సెక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 6, 7న తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధుల పోటా పోటీ సభలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు.