మా దయతో గట్టెక్కి మమ్మల్నే చీల్చుతారా!: షర్మిల
హైదరాబాద్: తెలుగు వారి దయతో గట్టెక్కి ఆ తెలుగు జాతినే కాంగ్రెసు పార్టీ చీల్చుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల మంగళవారం మండిపడ్డారు. షర్మిల బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర వల్లకాడు అవుతుందని, తాగడానికే కాకుండా సాగుకు కూడా నీళ్లు దొరకవని అన్నారు. కాంగ్రెసు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలనుకోవడం శోచనీయమన్నారు.
గతంలో మద్రాసు నుంచి వెళ్లగొట్టారని, ఇప్పుడు హైదరాబాదు నుండి వెళ్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క నీళ్లు, మరో పక్క హైదరాబాదులో చోటు ఇవ్వకుంటే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. రాయలసీమ వారు వ్యవసాయం చేసుకోవద్దా అని ప్రస్నించారు. పోలవరం ప్రాజెక్టును ఏ నీళ్లతో నింపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
విభజనకు ఆయనే కారణమని ఆరోపించారు. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, విభజనకు సహకరించారన్నారు. బాబు లేఖ ఇచ్చి ఉండకుంటే కేంద్రం విభజన చేసే సాహసం చేసేది కాదన్నారు. బాబు ఏ ముఖం పెట్టుకొని ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గురించి తెలియగానే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. ఎంతమంది సీమాంధ్ర కాంగ్రెసు, టిడిపి నేతలు రాజీనామా చేశారన్నారు.
గబ్బిలాల్లా పదవులు పట్టుకొని వేలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుండి ఇంత మంది ఎంపీలు ఉండి ఢిల్లీ పెద్దలకు వంగి వంగి సలాములు కొడుతున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. కుట్రలతో అక్రమ కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పారన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయనప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు.